Inter Exams | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా.. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఉదయం 8:45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్టికెట్లపై ముద్రించిన మాట వాస్తవమేనని, విద్యార్థులు త్వరగా పరీక్షాకేంద్రాలకు వస్తే టెన్షన్కు గురవకుండా పరీక్షరాస్తారన్న ఆలోచనతో అలా ముద్రించామని తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో కృష్ణఆదిత్య ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుడు ఓ విద్యార్థి ఆలస్యంగా పరీక్షకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపు ఇచ్చామని చెప్పారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు.
ఇది తొలి అడుగు మాత్రమే.. ఆత్మస్తైర్యం కోల్పోవద్దు
‘ఇంటర్ పరీక్షలు తొలి ప్రయత్నం.. జీవితంలో తొలి అడుగు మాత్రమే. పరీక్షలు బాగా రాయలేదన్న నెపంతో విద్యార్థులెవరూ ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు’ అని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య సూచించారు. పరీక్షలు బాగా రాయకపోయినా.. ఫెయిలైనా ఇదే ముగింపుగా భావించరాదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.