హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్సింగ్ బిట్టు, సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కాజీపేట రైల్వే తయారీ యూనిట్ త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఒక బహుముఖ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ యూనిట్ అని చెప్పారు. కాజీపేట తయారీ యూనిట్ ద్వారా రాబోయే ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా నడుపడానికి 200 అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.
ఈ రైళ్లను దేశమంతటా స్వల్ప, దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నామని తెలిపారు. ఈ రైళ్లు సాధారణంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో సుమారు 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. ఈ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్తో రూపొందుతాయని వెల్లడించారు. ప్రతి రైలుకూ 20 బోగీలుంటాయని, ప్రతి కోచ్ డిజైన్లో ఆధునిక సౌకర్యాలతో ఉంటుందని మంత్రి వివరించారు. ఈ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుందని చెప్పారు. రైలు బ్రేకులు వేసినప్పుడు ..అది విద్యుత్తు జనరేటర్గా మారి, పునరుత్పత్తి అయిన విద్యుత్తును తిరిగి గ్రిడ్లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల రవాణా విధానం, రోడ్డు రవాణాతో పోలిస్తే గణనీయంగా తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంటుందని అశ్వినీ వైష్టవ్ వివరించారు.