కురవి, ఫిబ్రవరి 27: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్/కళాశాలలో వార్డెన్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరీ తండాకు చెందిన పాల్తియా కిషన్కు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు కురవిలోని ఏకలవ్య మోడల్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా వార్డెన్ సుజాతతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది స్వప్న, లాలు, నవ్య, సృజన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ విద్యార్థినిని వేధిస్తున్నారు. దీనిపై బాధితురాలు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 25న మధ్యాహ్నం విద్యార్థిని ఫినాయిల్ తాగింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను మహబూబాబాద్లోని ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బాధితురాలి తండ్రి కిషన్ శుక్రవారం మహబూబాబాద్లో కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు.