హైదరాబాద్ : ఇంటర్ పరీక్ష ఫీజుల వసూలులో పలు ప్రైవేట్ కాలేజీలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫస్టియర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు రూ. 490 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కో విద్యార్థి నుంచి రూ. 700 వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు రూ. 1000 వరకు తీసుకుంటున్నాయి. పరీక్ష ఫీజుగా రూ.700 చెల్లించాలంటూ ఏకంగా విద్యార్థులకు ఎస్ఎంఎస్లు పంపించడం గమనార్హం. దీనిపై ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పందిస్తూ ఇంటర్బోర్డు నిబంధనల ప్రకారమే ఫీజులను వసూలుచేయాలన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ఈ నెల 4వ తేదీన ఇంటర్బోర్డు అధికారులు విడుదల చేశారు. 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించగా, అపరాధ రుసుముతో ఫిబ్రవరి 21 వరకు చెల్లించేందుకు గడువు విధించారు. అయితే నిబంధనల ప్రకారం ఫస్టియర్ ఆర్ట్స్, సైన్స్ విద్యార్థుల నుంచి రూ. 490, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థుల నుంచి రూ. 490, సైన్స్ విద్యార్థుల నుంచి రూ. 690 మాత్రమే ఫీజుగా తీసుకోవాలి.