హైదరాబాద్ : ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్(Integrated residentials ) పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విద్యాశాఖ అధికారులను అదేశించారు. గురువారం అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నామని , ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ ప్లాన్(Action Plan) రూపొందించాలని ఆదేశించారు. ఒకే చోట భవనాల వల్ల స్థల సమస్యను అధిగమించ వచ్చని, అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందించి కుల రహిత సమాజానికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం మధిర (Madira) నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టు ( Pilot Project ) గా ఎంపిక చేశామని వెల్లడించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం త్వరగా నిర్మించడానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్దుల్ నదీంను ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించునున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ధిక వెసలుబాటు కల్పించడానికి ఈకేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.