కరీంనగర్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో నలుమూలల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ. 5.80 కో ట్లతో ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు మంత్రి పూజలు నిర్వహించారు.
అంతకుముందు 2 వ డివిజన్లో సాధారణ నిధులు రూ.52 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్లు, పైప్ లైన్ పనులను, విద్యారణ్యపురి స్టార్ హాస్పిటల్ దగ్గర రూ.1.30 కోట్లతో చేపట్టనున్న పైప్ లైన్ పనులను, తెలంగాణ భవన్ సమీపంలో డి ఎం ఎఫ్ టి నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న గోపాల్ పూర్ బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్ లో కూరగాయలు, చేపలు, మాంసం, పూలు, పండ్లు అన్నీ ఒకే చోట విక్రయించేలా 5 కోట్ల 80 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించి తొమ్మిది నెలలలోపు మార్కెట్ ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
రైతులు, వ్యాపారులు రోడ్లపై, నేల మీద కూర్చొని విక్రయాలు చేయకుండా ఉండేందుకు హైజెనిక్ మార్కెట్ ను ఆధునికంగా నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రూ. 14 కోట్లాతో, 300 దుకాణాలు, రామ్ నగర్ మార్కెట్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే కోతి రాంపూర్ లో ని పెరుమాండ్ల దేవాలయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ స్థలాన్ని మంగళవారం ఉదయం పరిశీలిస్తామన్నారు. ఈ పరిశీలన కార్యక్రమానికి రాష్ట్ర ఐఎఎస్ అధికారి రజత్ కుమార్, ఢిల్లీకి చెందిన ఐ ఎన్ ఎ కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొంటారని, పరిశీలన చేసిన అనంతరం పనుల ప్రారంభానికి టెండర్లను పిలుస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం కార్ఖానా గడ్డలోని దూగోడ మిషన్ల సముదాయంలోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన కలపను మంత్రి పరిశీలించారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, జిల్లా మార్కెట్ కమిటీ అధికారి పద్మావతి తహసిల్దార్ సుధాకర్, మున్సిపాల్ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈ రామన్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.