హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) పౌల్ట్రీ రిసెర్చ్ డైరెక్టరేట్లో ఏర్పాటైన మొరింగ అండ్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ యూనిట్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సమీకృత వ్యవసాయం ప్రయోజనాలను చాటిచెప్పేందుకు ఈ ఫార్మింగ్ యూనిట్ ఎంతో దోహదపడగలదన్నారు. వాణిజ్యపరంగా కూడా కీలక భూమిక పోషిస్తుందని వివరించారు. పేద కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని సంపాదించి పెట్టడంలో పెరటి పౌల్ట్రీలు ఎంతో కలిసొస్తాయని, నిజానికివి గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. స్టార్టప్ల ద్వారా వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐడీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్, ఐకార్ డీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎన్ చటర్జీ తదితరులు పాల్గొన్నారు.