సూర్యాపేట, ఆగస్టు 20: పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా 30 జిల్లాల్లో సకల సౌకర్యాలతో పరిపాలన భవనాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా లో నూతనంగా ప్రారంభించే భవనం 22వదిగా నిలిచిందని చెప్పారు. 21 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ. 64.94 కోట్లతో ఈ భవన సముదాయం నిర్మించినట్టు తెలిపారు. దాదా పు 50 ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ పనిచేయనున్నాయని, సకల సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో సామాన్య ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఇంతచక్కటి కార్యాలయ సముదాయాన్ని ఉద్యోగులకు, ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.