ఏకపక్షంగా సెబీకి పత్రాల అందజేత
డివిజనల్, సర్కిల్ కార్యాయాల్లో ఉద్యోగుల ఆందోళన
భోజన విరామంలో పలువురు పాలసీదారుల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 : ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. అధీకృత మూలధనం, చెల్లించిన మూలధనంతో సంబంధం లేకుండా వాటాను ప్రకటించారని, ఇంతకుమించిన తెలివి తక్కువ తనం మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ డివిజనల్ కార్యాలయం, సర్కిల్-7 కార్యాలయాల వద్ద భోజన విరామంలో ఉద్యోగులు, ఏజెంట్లు, పలువురు పాలసీదారులు నిరసన వ్యక్తంచేశారు. గతేడాది బడ్జెట్లో పేర్కొన్నట్టుగా ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణ ద్వారా రూ.లక్షా 75 వేల కోట్లు సేకరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదని, అందుకే హడావిడిగా రూ.వేల కోట్లు సేకరించేందుకు ఎల్ఐసీలో 5 శాతం వాటాల విక్రయానికి ప్రయత్నిస్తున్నదని సంఘం నేతలు పేర్కొన్నారు. ఎల్ఐసీ విలువను అత్యంత తక్కువగా లెక్కిస్తున్నట్టు సమాచారం ఉన్నదని తెలిపారు. మార్కెట్ విలువ, పాలసీదారులు, ఉద్యోగులకు కేటాయించబోయే వాటాల సంఖ్య అంశాల్లో సందేహాలు ఉన్నాయని, వాటిని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో సంఘం నాయకులు తిరుపతయ్య, రవీంద్రనాథ్, సుజాత, వీ రమేశ్గౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.