కరీంనగర్ : రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడ కులస్తుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గీత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో కల్లుడిపోలు తెరిపించారన్నారు.
హైదరాబాద్లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. కల్లు డిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదని గుర్తు చేశారు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. గతంలో రెండేండ్లకు ఒకసారి కల్లుడిపోల లైసెన్సుల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీన్ని పదేళ్లకు పెంచాం.
కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్ లో నీరా షాపులు ఓపెన్ చేస్తున్నాం. కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లమని ఆయన వివరించారు. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తాం. నీరా దుకాణాలు హైదరాబాద్ లో సక్సెస్ అయితే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 50 ఏళ్లకే గీతకార్మికులకు 2016 రూపాయల ఫించన్ ఇస్తున్నాం.
ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నాం. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సీఎం ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు. పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నాం. ఇన్ని మీ కోసం మా ప్రభుత్వం చేస్తుంటే.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అని ప్రశ్నించారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పట్టించుకోవడం లేదన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని, బీసీ జనాభా గణన చేయాలని అడిగితే స్పందించడం లేదు. కేరళ మంత్రి మురళీధరన్ ను ఇక్కడికి తీసుకువచ్చి.. మీ గౌడన్నను తెచ్చాం.. ఓటేయండి అని అడుగుతున్నారు.
ఆయన మీటింగ్ కు మీరు కూడా వెళ్లారు కదా మీకోసం ఒక్క హామీ అయినా ఆ కేంద్రమంత్రి ఇచ్చాడా? మీరు కూడా తిన్న రేవు మరవకుండా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ వాళ్లు ఇక్కడ ఏం చేస్తారో చెప్పకుండా.. బెదిరింపులకు, దాదాగిరీలకు దిగుతున్నారు. బెదిరింపులకు ఓట్లు రాలవు, చేసిన పనులకే ఓట్ల వస్తాయని హితవు పలికారు. కొమురెల్లి గౌడ్ ఇంటికి వెళ్లి మీ గౌడ కులస్థులకు అన్నీ చేసాం.
పనిచేసేవాళ్లను కాపాడుకోవాలని నేను అడిగితేసరే అన్నా.. అంటూ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు.
ఇంకా రెండున్నరేళ్లు మేమే ఉంటాం. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లే బదులు అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు.