హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు. ఆదివారం మే డేను పురస్కరించుకొని సెక్రటేరియట్ వద్దనున్న ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలో ఐసీఈయూ అధ్యక్షుడితో కలిసి జెండాను ఎగురవేశారు.
ఎల్ఐసీలో ఐపీవోను వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్నదని తిరుపతయ్య అన్నారు. సోమవారం భోజన విరామసమయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. 4వ తేదీన 2 గంటలపాటు సమ్మె చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గిరిధర్, మద్దిలేటి, శ్రీనివాసన్, నగర పరిధిలోని అన్ని శాఖల కార్యాలయాల కార్యదర్శులు, ఐసీఈయూ సభ్యులు పాల్గొన్నారు.