‘మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆదుకునేటోళ్లు ఎవరా? అని ఎదురుచూస్తుంటే రైతు బీమా సాయంజేసి కేసీఆర్ మా ఇంటికి దేవుడిలా నిలిచిండు. సీఎం సార్ సాయాన్ని నేను సచ్చేదాకా యాది పెట్టుకుంటా’
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆదుకునేటోళ్లు ఎవరా? అని ఎదురుచూస్తుంటే రైతు బీమా సాయంజేసి కేసీఆర్ మా ఇంటికి దేవుడిలా నిలిచిండు. సీఎం సార్ సాయాన్ని నేను సచ్చేదాకా యాది పెట్టుకుంటా’ అని కర్నాటి లక్ష్మమ్మ చెబుతున్నది. నాగర్కర్నూల్లోని ఉయ్యాలవాడకు చెందిన కర్నాటి వెంకటస్వామిగౌడ్ ఊరిలో కల్లు దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఆయనకు ఎకరం భూమి ఉన్నది. భార్య లక్ష్మమ్మ, కొడుకు రమేశ్ గౌడ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన 2018 అక్టోబర్ 2న అనారోగ్యంతో మృతిచెందాడు. చుట్టాలున్నా మాట సాయం తప్ప ఆర్థిక సాయం చేసేవాళ్లు లేరు. ఆ సమయంలో.. వెంకటస్వామిగౌడ్ చనిపోయిన నెల రోజుల్లోనే ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లక్ష్మమ్మ ఖాతాలో జమైంది. ఆ డబ్బే ప్రస్తుతం కుటుంబానికి ఆధారంగా మారింది. వచ్చిన డబ్బులతో ఊరిలోనే చికెన్ షాప్ పెట్టుకొన్నారు. గతంలో కూలీ పనికి వెళ్లిన లక్ష్మమ్మ ఇప్పుడు తన చికెన్ సెంటర్ క్యాష్ కౌంటర్లో యజమాని అయ్యింది. ‘రైతు బీమా.. కేసీఆర్ సార్ మాకు ఇచ్చిన ధీమా. నా భర్త లేకున్నా ఎవ్వరి వద్ద చేయి చాచే పరిస్థితి లేకుండా చేశారు. కేసీఆర్ పదికాలాల పాటు సల్లగా ఉండాలి. ఆయన బాగుంటేనే మాలాంటి పేదోళ్లు సంతోషంగా ఉంటారు’అని చెప్తున్నది.
పేదోళ్ల దేవుడు ఆడబిడ్డలను ఆదుకొంటున్న కల్యాణలక్ష్మి
బచ్చన్నపేట, ఫిబ్రవరి 16 : పేద, మధ్య తరగతి జీవితాలకు కూతురి పెండ్లి అంటే యుద్ధం. అప్పో, సప్పోజేసైనా పెండ్లి చెయ్యాలె, కట్నకానుకలు ఇయ్యాలె, బిడ్డను మంచి ఇంటికి పంపాలె..! చేతిలో ఒక్క రూపాయి ఉన్నా ఆసరానే. ఆడబిడ్డ పెండ్లి అంటే ఎన్ని ఖర్చులు, కష్టాలు ఉంటాయో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల మేనమామ అయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్కు చెందిన కోల సుప్రియ కూడా కల్యాణలక్ష్మి అందుకొన్న ఆడబిడ్డే. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా తన తల్లిదండ్రులు ఎంత లబ్ధి పొందినది వెల్లడించింది. ‘పేదోళ్ల దేవుడు సీఎం కేసీఆర్ సార్. కల్యాణలక్ష్మి పథకం ఎదిగిన ఆడబిడ్డలను ఆదుకొంటున్నది. ఆయన మేలు జీవితంలో మరువం. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం. మా అమ్మనాన్నలు నాగలక్ష్మి, సత్యనారాయణ. వారికి ఏకైక కూతురును. అమ్మ ఇంట్లోనే ఉంటది. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నది గీత వృత్తి. అప్పు జేసి గతేడాది ఐదో నెల 23న పెండ్లి చేసిండు. పెండ్లి కాంగనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొన్న. చెక్కు ఇంటికే తెచ్చి ఇచ్చిండ్రు. ఆ డబ్బు మా నాన్నకు భరోసా అయ్యింది.’ అని పేర్కొన్నది.
నాడు కూలీగా.. నేడు కళాకారుడిగా
హుస్నాబాద్, ఫిబ్రవరి 16: ఒకప్పుడు కూలీపనికి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూసిన దీన పరిస్థితులు.. ఇప్పుడు కళాకారుడిగా ఉద్యోగం, సగర్వంగా బతికే జీవితం. ఇది హుస్నాబాద్కు చెందిన గడిపె బాలు జీవితంలో గొప్ప మలుపు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారని, దాంతో కష్టాలు దూరమై, నెలనెలా వేతనాన్ని అందుకొంటున్నానని చెప్పారాయన. తన కూతురు మౌనిక పెండ్లి చేశానని, ఇంటిని మరమ్మతు చేసుకొన్నానని ఆనందంగా వెల్లడించారు. కొడుకు శ్రావణ్ను బీటెక్ చదివిస్తూ జీవితాన్ని సంతోషంగా ఉన్నానని తెలిపారు. ‘జీవితానికి ఇది చాలు. సీఎం కేసీఆర్కు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్కు కృతజ్ఞతలు. మా కుటుంబం బతికి ఉన్నన్నేండ్లు వారికి రుణపడి ఉంటాం’అని బాలు వ్యాఖ్యానించారు.
ధూపదీప కాంతులు కేసీఆర్ పుణ్యమే
రామగిరి, ఫిబ్రవరి 16: చేసేది అర్చకత్వం.. వచ్చేది నెలకు వెయ్యి, రెండు వేలు.. దాంతోనే నెలంతా కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి. నాడు ప్రతి అర్చకుడి జీవితం ఇలాగే ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధూపదీపనైవేద్య పథకంతో ఎంతోమంది జీవితాల్లో కాంతులు విరజిమ్మాయి. అందుకు ఒక ఉదాహరణ నల్లగొండ జిల్లాకు చెందిన పద్మాచారి. జిల్లాలోని కనగల్ మండలం గడ్డంవారియెడవల్లికి చెందిన పద్మాచారి నల్లగొండలోని ఒంటి స్తంభం శివాలయం, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. దేవాలయ కమిటీ నెలకు ఇచ్చే అరకొర సొమ్ముతో కుటుంబాన్ని పోషించటం కష్టంగా ఉండేది. ధూప, దీప నైవేద్య పథకంలో ఈ గుడిని చేర్చటంతో పద్మాచారికి ప్రతి నెలా రూ.6 వేలు వస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్ పుణ్యమేనని పద్మాచారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.