PRLIS | కొల్లాపూర్, సెప్టెంబర్ 11: ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రపంచం నివ్వెరపోయే విధంగా సుజల దృశ్యాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో సీఎం కేసీఆర్ పర్యటన, బహిరంగ సభ స్థలాన్ని, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి, ఐజీ షానవాజ్ ఖాసీం, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి సోమవారం మంత్రులు పరిశీలించారు. ఎల్లూరు రహదారిలోని బొంగురాలమిట్టలో బహిరంగ సభకు ప్రదేశాన్ని పరిశీలించి ఖరారు చేశారు.
అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అతి భారీ మోటర్లను ఉపయోగించి 300 మీటర్ల దిగువన ఉన్న కృష్ణా జలాలను సముద్రమట్టానికి 687 మీటర్ల ఎత్తున పంపింగ్ చేయనున్నట్టు తెలిపారు. ఇది సాంకేతిక రంగంలో ఒక గొప్ప విజయంగా నిలిచిపోనున్నదని చెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో నీటి గోస తీరనున్నదని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతు బిడ్డలు, కూలీలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలిరావాలని మంత్రులు పిలుపునిచ్చారు.