Gurukul School | గురుకుల పాఠశాలల్లో నిత్యం ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం వడ్డించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మెట్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం వడ్డించారు. ఈ గురుకులంలో 530 మంది విద్యార్థినులు ఉండగా.. వారందరికీ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయం బయటకు రావడంతో మీడియా వెళ్లి అడగ్గా.. ‘అడగానికి మీరెవరు? మీరు ఎందుకు లోపలికి వచ్చారు?’ అంటూ ప్రిన్సిపాల్ డి.మాధురి రెచ్చిపోయారు. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఆహార నాణ్యత పర్యవేక్షణలో అధికారులు తీరు మారడం లేదని తెలంగాణ ప్రజానీకం మండిపడుతున్నారు. కాగా, ఇదే పాఠశాలలో గతంలో ఓ ఉపాధ్యాయుడు బాలికలను శారీరకంగా వేధించడంతో అతనిపై పోక్సో కేసు నమోదవ్వడం అప్పట్లో సంచలనం సష్టించింది.