హైదరాబాద్, నవంబర్ 15, నమస్తే తెలంగాణ : ఆలిండియా సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు వివాద వ్యాజ్యాలపై ఈ నెల 20 నుంచి రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. తాజాగా ఆయా అధికారులు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే దానిని కేంద్రం ఎందుకు పరిశీలన చేయరాదని అభిప్రాయపడింది. డీజీపీతోపాటు 12 మంది అలిండియా సర్వీసు అధికారుల కేటాయింపుల వివాదాన్ని జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
ప్రత్యూష్ కుమార్ సిన్హా కమిటీ సిఫారసులు చెల్లవని క్యాట్ 2017లో ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ అధికారేనని హైకోర్టు ఇచ్చిన తీర్పు డీజీపీ, ఇతర అధికారులకు వర్తిస్తుందని కేంద్రం వాదిస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంగా 637 ఆలిండియా అధికారుల కేటాయింపు జరగ్గా, ఇందులో 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్లో సవాల్ చేసి ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే.