హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది. ఇందుకు కేంద్ర బడ్జెటే ఉదాహరణ. అంతర్రాష్ట్ర వివాదాలు ఎదుర్కొంటూ.. ఇప్పటికీ నీటి కేటాయింపులే పూర్తికాని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదాను ప్రకటించి, బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించింది.
బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా తన విధానాలను కొనసాగిస్తున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు ప్రాజెక్టులకు (పోలవరం, కెన్-బెట్వా) జాతీయ హోదాను ప్రకటించింది. ఏ పీ పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్నారని చెప్తూ పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ను కట్టబెట్టింది. ఆ సందర్భంగానే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆశలతో మరోసారి కాళేశ్వ రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కో రింది. ఈ అంశాన్ని తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో సైతం ప్రస్తావించారు. దీనిపై అప్ప టి జల్శక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పంది స్తూ ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చే విధానం ఉండబోదని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా, తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఏమాత్రం సరితూగని ప్రాజెక్టులకు జాతీయహోదాను ప్రకటించడం బీజేపీ కక్షసాధింపు చర్యలకు అద్దం పడుతున్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓట్ల కోసమే తాయిలాలను ప్రకటిస్తున్నదని సాగునీటిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటిస్తూ, నిధులు కేటాయిస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది యూపీ ఎన్నికల నేపథ్యంలో కెన్-బెట్వా రివర్ లింక్ ప్రాజెక్టుకు 1400 కోట్ల బడ్జెట్ను ప్రకటించిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో దాని ఊసేలేకుండా చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఆ తరహాలోనే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల నిధులను కేటాయించిందని అంటున్నారు.