Minister Sabitha | మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో ‘చెలిమి’, ‘అంకురం’ కార్యక్రమాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులు అభ్యసిస్తేనే జాతినిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేలా చిన్ననాటినుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు ప్రపంచంలో వ్యాపారం చేసే వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పారు.
విద్యార్థులకు ఉన్నత శిఖరాలను చేరడంపై, సాధికారులను చేయడంతో పాటు వీలైన అవకాశాలు లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి తనకు తానుగా సమాయత్తం చేసుకొనే నైపుణ్యాలు నేర్చుకునేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్చుకునే ఓపిక, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకొని చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది జిల్లాల్లో 35కేజీబీవీ, మోడల్ స్కూల్లో 11వ తరగతి విద్యార్థులకు కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని పాఠశాలకు కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన పాల్గొన్నారు.