శ్రీశైలం : కృష్ణా నదిపై ఉన్న జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,06,205 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. జలాశయం మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి 1,46,888 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరో వైపు కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.70 అడుగులున్నది.
నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్లోకి వరద కొనసాగుతున్నది. 12గేట్లు ఎత్తి 96,072 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589.10 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 309.35 టీఎంసీలు నిల్వ ఉన్నది. ప్రస్తుతం జలాశయానికి 1.48లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఉండగా.. అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉన్నది.