Sriram Sagar Dam | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరిలోకి భారీగా వరద వస్తున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతున్నది. జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి 26,296 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పూర్తిస్థాయికి చేరుకుంటున్నది.
శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1084 అడుగుల వద్ద ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు 63.75టీఎంసీలు ఉన్నది. అలాగే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5300 క్యూసెక్కుల వరద వస్తున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1400 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వ 11.91 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.80 టీఎంసీలు.