2014లో కిలో కందిపప్పు ధర రూ.83.23.. ఎనిమిదేండ్ల మోదీ సర్కారు పాలనలో ఇప్పుడది రూ.140!
ఆనాడు బియ్యం ధర కిలో రూ.27.28 అదే ఇప్పుడు రూ.50!
ఆలుగడ్డ.. అప్పుడు కిలో రూ.15.24 ఉంటే.. ఇప్పుడు రూ.33 అయ్యింది!
అన్నం, పప్పు, కూర వండుకునే వంట గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిదేండ్ల క్రితం రూ.414 ఉంటే.. ఇప్పుడు ఎకాఎకిన రూ.1052 అయిపోయింది!
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతున్నదని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటిందని పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ, మే 10: వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది. ఇవి వేగంగా పెరగడమేకాదు, మునుపెన్నడూ చూడని స్థాయికి చేరిపోతున్నాయి. భరించలేని స్థాయికి చేరడంతో ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతోపాటు.. పొదుపునూ తగ్గించాల్సి వస్తున్నది. ధరలు పెరుగుతున్న వేగాన్ని చూపించే ద్రవ్యోల్బణం రేటు 17 నెలల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయా ఉత్పత్తులతో కూడిన సూచీలు రికార్డుస్థాయికి పెరిగిపోయాయి. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలే దేశంలో ధరలెలా పెరిగాయో చెప్తున్నాయి. రిటైల్ స్థాయిలో ధరలెలా ఉన్నాయో తెలిపే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) మార్చి నెలలో 165.2 పాయింట్ల స్థాయిని అందుకోగా, టోకున పలుకుతున్న
ధరల తీరును వివరించే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 148.8 పాయింట్లకు చేరింది.
ఈ రెండు ప్రామాణిక ధరల సూచీలకు ఇదే రికార్డు గరిష్ఠం. దేశంలో అమ్ముడుపోయే ప్రతీ ఉత్పత్తిని కలిగి ఉన్న ఈ సూచీల పెరుగుదల రేటు (దవ్యోల్బణం రేటు) కొద్ది నెలలుగా వేగవంతమయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలలు దేశ రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 6% గరిష్ఠ పరిమితిని దాటిపోయింది. ఫిబ్రవరిలో 6.1 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) వృద్ధి రేటు మార్చిలో 6.95 శాతానికి ఎగబాకి 17 నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. పెరుగుదల వేగం మాత్రమే 17 నెలల గరిష్ఠం తప్ప, ధరలు రికార్డు స్థాయే. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల ఆందోళనక కల్గిస్తున్నది. ఈ మార్చిలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు 7.7 శాతానికి ఎగసింది. అలాగే ఫిబ్రవరిలో 13.1 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సైతం మార్చిలో 14.6 శాతానికి దూసుకెళ్లడం అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఆర్బీఐకి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. దీంతో గతవారమే హఠాత్తుగా రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్దాస్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తూ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు పెంచారు.
మరింతగా ధరల పోటు
ఈ ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేదిలేదని, వచ్చే కొద్దినెలల్లో మరింతగా పెరుగుతూ పోతాయని విశ్లేషకులు చెప్తున్నారు. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని అదేపనిగా పెంచిన ప్రభావం ఇతర ఉత్పత్తులపై క్రమేపీ పడుతుందని వారంటున్నారు. ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం డాటా ఈ వారంలో వెలువడనున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశాలు లేకపోవడంతో ద్రవ్యోల్బణ పెరుగుదల సమస్య కనీసం ఏడాది వరకు దేశాన్ని పీడించవచ్చని, ఏప్రిల్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా మన దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇది యూరప్కు సంబంధించిన ద్రవ్యోల్బణ అంచనా (5.3%) కంటే 0.8% ఎక్కువ. బ్రిటన్ ద్రవ్యోల్బణ అంచనా (7.4%) కంటే 1.3%, అమెరికా ద్రవ్యోల్బణ అంచనా (7.7%) కంటే 1.6% తక్కువ. సాధారణంగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండే ఈ ప్రాంతాలు ప్రస్తుతం ధరల విషయంలో అసాధారణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. కమోడిటీ ధరలు పెరగడం, లేబర్ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడులే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పట్లో శాంతించకపోవచ్చని, 2023లో మాత్రం 4.8 శాతానికి తగ్గవచ్చని ఐఎంఎఫ్ పేర్కొన్నది.
ఈ స్పీడ్కు కారణాలివి…
రష్యా-ఉక్రయిన్ యుద్ధం: ఈ రెండు దేశాల మధ్య పోరుతో సరఫరాలు స్తంభించడంతో ముడి చమురు, ఎల్పీజీ తదితర ఇంధనాలు, పొద్దు తిరుగుడు తదితర వంటనూనెలు ధరలు పెరిగాయి. పామోలిన్ను అధికంగా ఉత్పత్తి చేసే మలేషియా వాటి ఎగుమతుల్ని తాత్కాలికంగా నిషేధించడం నూనెల ధరల పెరుగుదలకు మరో కారణం.
పెట్రోల్, డీజిల్: ముడి చమురు భగ్గుమనడంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవి పెరగడం రవాణా చార్జీలను సైతం అధికం చేశాయి. దీంతో ప్రతీ ఉత్పత్తి ధర పెరిగిపోయింది.
ఆర్బీఐ వాదన: మరోవైపు ఇంధనాల ధరలు ఎగుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సుంకాల్ని తగ్గించకపోవడంతో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించిపోయిందని రిజర్వ్బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. ఇంధనాలపై పన్నుల్ని తగ్గించాలంటూ ప్రభుత్వానికి పదే పదే విన్నవించామని, అది జరక్కపోవడంతో హఠాత్తుగా వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందంటూ ఆ వర్గాలు వాదిస్తున్నాయి.
రూపాయి క్షీణత: రూపాయి పతనం కూడా ధరలకు ఆజ్యం పోస్తున్నది. డాలరు మార్పిడిలో రూపాయి కొద్ది వారాలుగా క్రమేపీ 75 స్థాయి నుంచి పడిపోతూ వచ్చింది. తాజాగా 77.50 స్థాయికి తగ్గింది. కరెన్సీ తగ్గుదలతో దేశం దిగుమతి చేసుకునే ప్రతీ ఉత్పత్తి ధర పెరుగుతున్నది.
సర్దుకుంటున్నాం
మార్కెట్లో ఏది ముట్టుకున్నా మండుతోంది. నిత్యావసరాలు, నూనె ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఇతర ఖర్చులు తగ్గించుకొని, తక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కొని సర్దుకుంటున్నాం. వంటగ్యాస్ ధరలూ నానాటికీ ఆకాశాన్ని అంటుతున్నాయి.
– సుజాత, గృహిణి, తుకారంగేట్
ఇబ్బందులు పడుతున్నాం..
నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. కూరగాయల రేట్లు, రవాణా చార్జీలు పెరగడంతో మాలాంటి సామాన్యులం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలి.
– బోయ చెన్నమ్మ, టీ కొట్టు నిర్వాహకురాలు, మడ్ఫోర్డ్
కొనలేం.. తినలేం
కూరగాయల ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో కొనలేం.. తినలేం అన్న చందంగా మారింది. కిలోకు బదులు పావుకిలో, అరకిలో కొనాల్సివస్తున్నది. పెరిగిన ధరలతో కడుపు నింపుకునే పరిస్థితి లేకుండా పోయింది. పొద్దంతా కష్టపడి వచ్చిన డబ్బులతో సగం కూరగాయలకే పోతుంది. ఈ ధరలతో ఇంతటితో ఆగుతాయో లేదో తెలుస్తలేదు.
– జోగు జంగమ్మ, కార్మికురాలు, అంబేద్కర్ హాట్స్, మడ్ఫోర్డ్