కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాంనగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్లో గుర్తు తెలియని మహిళ ప్రసవించింది. మృతి చెందిన శిశువును చున్నీలో చుట్టి, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయింది మహిళ. చేపల మార్కెట్లో చేపలు విక్రయించే మహిళలు.. శిశువును చూసి అక్కడున్న వాచ్మెన్కు సమాచారం అందించారు.
అప్రమత్తమైన వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు. నిన్న రాత్రి ఓ గుర్తు తెలియని మహిళ సులభ్ కాంప్లెక్స్కు వచ్చినట్లు వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.