మాదాపూర్, డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ హనుమంతరావు ఆరోపించారు. దేశంలో సామాజిక, రాజకీయ అవరోధాలను అధిగమించడం లో ప్రభుత్వం విఫలమవుతున్నదని చెప్పారు. కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో సోమవారం జరిగిన నీలం రాజశేఖర్రెడ్డి 27వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా దేశంలో ఆదాయ అసమానతలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో వార్షిక తలసరి ఆదాయం వృద్ధిరేటు 1951 నుంచి 1980 మధ్య 1.7 శాతం ఉండగా, 1980 నుంచి 2015 మధ్యకాలంలో అది 3.3 శాతానికి పెరిగిందని చెప్పారు. పేదల తలసరి ఆదాయం 2.2 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గిపోగా, టాప్ 10 శాతం ఆదాయవర్గాల వారి సంపద 1.2 శాతం నుంచి 5.1 శాతం వరకు పెరిగిందని తెలిపారు. మరోవైపు దేశంలోని అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది ఆదాయం 0.2 శాతం నుంచి 6.6 శాతం పెరిగిందని వివరించారు. ఆదాయ అసమానతలు అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లోనే మూడింట రెండువంతుల జనాభా నివసిస్తున్నట్టు ప్రపంచ సామాజిక నివేదిక-2020 తెలుపుతున్నదని పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆదాయ అసమానతలు పెరగడం అనివార్యం కాదని చెప్పారు. నిజానికి ప్రపంచీకరణ బాట పట్టిన అనేక దేశాలు ఈ అసమానతలను తగ్గించేందుకు ఇతర విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామీకరణ, నూతన సామాజిక కార్యక్రమాల పెంపు, విద్య, సామాజిక భద్రత విస్తరణ పెంపు ద్వారా అసమానతలను తగ్గించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు సురవరం సుధాకర్రెడ్డి, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఇక్రిశాట్ మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కే పూర్ణచందర్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.