నిర్మల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : దాదాపు 40 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ(Congress party) ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్నారు. మంగళవారం నిర్మల్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. ఈ మారణకాండలో 250 మందికి పైగా ఆదివాసులు మరణించారన్నారు. గత చరిత్ర తెలియని ఇప్పటి కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు ఆదివాసులను పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం గిరిజనుల ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో రేవంత్రెడ్డి సభ పెట్టారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందాయని ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చి ‘మా ఊళ్లో-మా రాజ్యం’ నినాదాన్ని సాకారం చేశామన్నారు.
విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా మారుమూల పల్లె బడుల్లో ఆంగ్ల విద్యను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు.