హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం జరిపేందుకు ఆయిల్ఫెడ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల బృందం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో పర్యటిస్తున్నది. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ మరికొందరు అధికారులతో కూడిన ఈ బృందం ఈ నెల 24 వరకు జరిపే పర్యటనలో భాగంగా శుక్రవారం థాయిలాండ్కు చేరుకొన్నది.
ఆయిల్ పామ్ సాగులో ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ప్రపంచంలోనే ముందున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సాగు విధానాలపై మన అధికారులు అధ్యయనం చేయనున్నారు. తెలంగాణకు కావాల్సిన ఆయిల్ పామ్ విత్తనాలను సరఫరా చేయడంపై ఆయా దేశాల్లోని కంపెనీలతో చర్చలు జరుపనున్నారు. 2022-23 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే ఐదేండ్లలో ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.