హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి ఇప్పుడున్న వజ్రాయుధం.. వ్యాక్సిన్. టీకా వేసుకొంటే మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అయితే, కరోనా వ్యాక్సిన్లు ఆరు నెలల పాటు ప్రభావం చూపుతున్నాయని, ఆ తర్వాత రోగ నిరోధకశక్తి క్రమంగా తగుతున్నదని ఏఐజీ హాస్పిటల్స్ అధ్యయనంలో తేలినట్టు దవాఖాన చైర్మన్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఏషియన్ హెల్త్కేర్ ఫౌండేషన్తో కలిసి 1,636 మందిని పరిశీలించగా, 30 శాతం మందిలో ఇమ్యూనిటీ తగ్గిందని వెల్లడించారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ తగ్గుదల కనిపించిందని వివరించారు. వ్యాక్సిన్ తీసుకొన్నాక అది ఎంతకాలం పనిచేస్తుంది? బూస్టర్ అవసరమైన నిర్దిష్ట జనాభాను అంచనా వేసేందుకే ఈ అధ్యయనం చేసినట్టు తెలిపారు. అధ్యయనంలో భాగంగా సార్స్-కొవ్-2కి ఐజీజీ యాంటి ఎస్1, ఐజీజీ యాంటి ఎస్2 యాంటిబాడీలను వేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు కనిష్ఠంగా 100ఏయూ/ఎంఎల్ యాంటిబాడీస్ ఉండాలి, 30 శాతం మందిలో అవి తక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాళ్లంతా 40 ఏండ్లు పైబడినవాళ్లే. మొత్తంగా 6 శాతం మందిలో అసలు రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందనే లేదు. కాగా, రోగ నిరోధక శక్తి తగ్గితే.. దీర్ఘకాలిక వ్యాధులుండి 40 ఏండ్లు దాటినవాళ్లలో సార్స్ కొవి-2 సంక్రమణ ఎక్కువగా ప్రమాదకారిగా మారే అవకాశాలున్నట్టు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు రెండు డోసులు తీసుకొన్న 6 నెలల తర్వాత బూస్టర్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మిగతావారికి 9 నెలల విరామం తర్వాత ప్రికాషన్ డోస్ ఇచ్చే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.