ఐఏఎంసీకి అన్ని అర్హతలు ఉన్న నగరం హైదరాబాద్
త్వరలో ఇక్కడికే ఎక్కువ మధ్యవర్తిత్వ కేసులు
ఐఏఎంసీ ప్రారంభోత్సవంలోసుప్రీం కోర్టు సీజే జస్టిస్ రమణ
సంస్థ ఏర్పాటులో సీఎం కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రశంస
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే ఆరో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) మన భాగ్యనగరంలో కొలువుదీరింది. శనివారం నానక్రామ్గూడఫీనిక్స్ వీకే టవర్స్లో ఐఏఎంసీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సీఎం కేసీఆర్తో కలిసి ప్రారంభించారు. ఐఏఎంసీకి హైదరాబాద్ సరైన వేదికని ఎన్వీ రమణ కొనియాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి వీలుగా చట్టసవరణ చేస్తామని సీఎం కే చంద్రశేఖర్రావు తెలిపారు.
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటుకు మనదేశంలో హైదరాబాద్ నగరమే అత్యుత్తమ వేదిక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న హైదరాబాద్ దేశంలో అన్నింటికన్నా గొప్ప నగరమని కొనియాడారు. గచ్చిబౌలి నానక్రామ్గూడలోని ఫీనిక్స్ వీకే టవర్స్లో ఐఏఎంసీని శనివారం జస్టిస్ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఐఏఎంసీని ప్రాంతీయాభిమానంతోనో, ప్రత్యేక ప్రేమతోనో ఏర్పాటుచేయలేదని సీజేఐ స్పష్టంచేశారు.
హైదరాబాదీలది విశాల హృదయం
ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాదే సరైన వేదిక అని, నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ పునరుద్ఘాటించారు. దేశ విదేశీ సంస్థల ప్రతినిధులు సింగపూర్, లండన్లోని ఐఏఎంసీలకు వెళ్లకుండా వివాదాల పరిష్కారానికి హైదరాబాద్కు వచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అతి త్వరలోనే హైదరాబాద్ ఐఏఎంసీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘హైదరాబాద్ నా నగరం. ఈ మహానగరానికి ఎవరినైనా ఆకట్టుకొనే శక్తి ఉన్నది. నిజం చెప్పాలంటే దేశంలో హైదరాబాదే ఉత్తమ నగరం. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలకు వారధిగా ఉన్నది. వాణిజ్యపరంగా గొప్ప పురోగమనంలో ఉన్న నగరం. అందుకే ఐఏఎంసీకి ఈ నగరాన్ని ఎంపికచేశాం. విభిన్న సంప్రదాయాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం ఈ నగరం. హైదరాబాదీలది అందరినీ ప్రేమతో అకున చేర్చుకొనే విశాల హృదయం. అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్ విషయంలో గర్వపడేలా ఏదో చేయాలన్న తపనతోనే ఐఏఎంసీని ఏర్పాటుచేశాం. ప్రపంచమంతా ఈ ఐఏఎంసీ కోసం ఎదురుచూస్తున్నది. సింగపూర్ ఐఏఎంసీకంటే ఉత్తమంగా ఈ సంస్థ పనిచేస్తుంది’ అని జస్టిస్ రమణ తెలిపారు.
సీఎం చొరవ ఫలితమే..
అతి తక్కువ సమయంలోనే ఐఏఎంసీని ప్రారంభించటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా వ్యవహరించారని సీజేఐ జస్టిస్ రమణ కొనియాడారు. జూన్ 12న సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఐఏఎంసీ ప్రతిపాదన చేసినప్పుడు సీఎం కేసీఆర్ స్పందించిన తీరు ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఆగస్టు 20న ఎంవోయూ, అదే నెల 27న ఐఏఎంసీ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్, ఈ నెల 4న పరిచయ కార్యక్రమం, ఇప్పుడు ఐఏఎంసీని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఐఏఎంసీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి పట్ల గర్వపడుతున్నట్టు చెప్పారు. అడిగిన వెంటనే ఈ కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ భూమి, వసతులు, నిధులు అందజేశారని తెలిపారు.
పీవీ వేసిన బీజమే..
దేశంలో మధ్యవర్తిత్వ సంస్థలకు తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే బీజం వేశారని జస్టిస్ రమణ తెలిపారు. 26 ఏండ్ల క్రితం 1995 అక్టోబర్ 19న ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ప్రారంభించారని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకొంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని, లేదంటే న్యాయం సకాలంలో అందక ప్రజలు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతారని ఆందోళన వ్యక్తంచేశారు. సమర్థ పాలన, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు. వ్యాపార, వాణిజ్యపరంగా పురోగతి సాధించాలన్నా మధ్యవర్తిత్వ విధానమే సరైందని తెలిపారు. మనదేశంలో అనాదిగా వస్తున్న మధ్యవర్తిత్వ విధానమే ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని చెప్పారు. హైదరాబాద్ ఐఏఎంసీలో వ్యాపార, వాణిజ్యపరమైన వివాదాలే కాకుండా కుటుంబ వివాదాలు కూడా పరిషరించుకొనే వెసులుబాటు ఉంటుందని సీజేఐ వెల్లడించారు. అనంతరం ఐఏఎంసీ శాశ్వత భవనాల కోసం దుర్గం చెరువు వద్ద ప్రభుత్వం ప్రతిపాదించిన భూమిని సీఎం కేసీఆర్తో కలిసి జస్టిస్ రమణ పరిశీలించారు.
తొలి కేసు మోదీలది
హైదరాబాద్ ఐఏఎంసీ ప్రారంభానికి ముందే విచారణకు ఓ కేసు రావటం విశేషం. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీ కుటుంబ వివాదం తొలికేసుగా ఐఏఎంసీలో విచారణకు రానున్నది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిశీలించుకోవాలని సూచించినట్టు సీజేఐ రమణ తెలిపారు. తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు తమ ముందుకు వచ్చే కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకొనేందుకు ఆసక్తి చూపితే ఐఏఎంసీకి సిఫారసు చేయాలని కోరారు. ఐఏఎంసీ ప్రారంభానికి ముందే కేసులు రావడం శుభసూచకమని చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటులో జస్టిస్ రవీంద్రన్ కీలకపాత్ర పోషించారని కొనియాడారు.