సృజనాత్మక ఆలోచనలకు భౌతికరూపం ఇచ్చే కర్మాగారం టీ-వర్క్స్.. నూతన ఆవిష్కరణల్లో ఇండియా అగ్రగామిగా ఎదిగే ప్రక్రియను వేగవంతం చేయనున్నది. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకో సిస్టమ్స్కు తోడుగా నిలువనున్నది. తెలంగాణ సర్కారు సిద్ధం చేసిన భారతపుదేశపు అతిపెద్ద నమూనాల తయారీ కేంద్రం (ప్రొటోటైపింగ్ సెంటర్) మార్చి 2న లాంఛనంగా ప్రారంభం కానున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన తెలంగాణ ఇప్పుడు టీ-వర్క్స్తో నూతన ఆవిష్కరణలకు ఊతం ఇవ్వనున్నది. దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ను తెలంగాణ సర్కారు సిద్ధం చేసింది. వివిధ రకాల నమూనాలను (ప్రొటోటైప్) డిజైన్ చేయడం, నిర్మించడం ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకొన్నది. అలాంటి ఖర్చుతో కూడిన వ్యవహారాన్ని పూర్తిగా తగ్గిస్తూ దేశంలోనే మొట్ట మొదటి ప్రోటోటైపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఐటీ కారిడార్లోని ఐటీ హబ్ పక్కనే 4.7 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్లతో టీ-వర్స్ను నిర్మించి, తయారీ యంత్రాలను అందుబాటులో ఉంచింది. సృజనాత్మకతగలవారు ఎవరైనా ఆలోచనతో వచ్చి ఒక పూర్తిస్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా, అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగం ఒకే చోట కొలువుదీరి ఉంటుంది. ప్రస్తుతం టీ వర్క్స్ మొదటి దశ నిర్మాణం దాదాపు పూర్తైంది. వచ్చే నెల మార్చి 2న దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించారు. టీ-వర్క్స్ భవనానికి సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని ప్రారంభిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మొత్తం 4.79 ఎకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్లో స్టార్టప్లు తమ ఆలోచనలకు అనుగుణంగా నమూనాలను తయారు చేసేందుకు అవసరమైన వందకుపైగా యంత్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల్లో దేశం అగ్రగామిగా మారేందుకు టీ-వర్క్స్ సహాయపడుతుందని తెలిపారు. ‘78 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఈ ప్రొటోటైపింగ్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. నమూనాల రూపకల్పనకు ఇక్కడి పరికరాలు ఎంతో సహాయపడతాయి. ఇండియా ఉత్పత్తి ఆవిష్కరణ ప్రయాణాన్ని టీ-వర్క్స్నుంచి ప్రారంభిద్దాం. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని ట్వీట్ చేశారు.
మూడు దశల్లో.. 4.79 ఎకరాల్లో..
తెలంగాణ సర్కారు ఐటీ కారిడార్లోని రాయదుర్గం నాలెడ్జ్సిటీలో టీ-హబ్ పక్కనే సుమారు 4.79 ఎకరాల స్థలంలో రూ.350 కోట్ల వ్యయంతో దశలవారీగా టీ-వర్క్స్ను ఏర్పాటు చేసింది. మొదటి దశలో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ అవసరాలకు ఉపయోగించే ఉత్పత్తులను తయారు చేసేందుకు యంత్రాలను అందుబాటులో ఉంచారు. మూడు దశల్లో నిర్మించే టీ-వర్స్ విస్తీర్ణంలో 2 లక్షలకుపైగా చదరపు అడుగులు ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణస్థాయిలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూరల్ ఇన్పోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఆర్ఐడీపీ), హెల్త్ ఇన్నోవేషన్ డెవలప్ ప్రోగ్రాం (హెచ్ఐడీపీ)ను చేపట్టారు. టీ-హబ్ తరహాలోనే టీ-వర్క్స్ను ఆరేండ్ల క్రితమే బేగంపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తెలంగాణవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి, వారికి టీ -వర్క్స్లో చోటు కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీ-వర్క్స్ ప్రాంగణంలో ఒకేసారి 200 మందికిపైగా ఇన్నోవేటర్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండే యంత్రాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు 3 షిప్టుల్లో పనులు నిర్వహించుకొనే వీలుంది. సహకారాన్ని అందించేందుకు నిపుణులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు.
భౌతికంగా ఒక వస్తువును తయారుచేయాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. ఖర్చుతో కూడుకొన్నందున ఔత్సాహికులు వీటిని సమకూర్చుకోవడం చాలా కష్టం. అలాంటి వారికి ఒక వేదికగా టీ- వర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.