హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అన్ని రకాల వస్తువులు, యంత్రాలు మనదేశంలోనే తయారుచేసేలా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రకటించిన కేంద్రంలోని బీజేపీ సర్కారు, కోట్లమంది పేదలకు ఆధారమైన చేనేతకు మాత్రం ఉరివేస్తున్నది. ప్రపంచమే మెచ్చిన భారతీయ చేనేత పరిశ్రమను అగాథంలోకి నెట్టే చర్యలు చేపట్టింది. మనదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికమందికి ఉపాధి ఇస్తున్నది వస్త్రపరిశ్రమే. అందునా నేత పరిశ్రమను నమ్ముకొని 90 లక్షలకుపైగా కుటుంబాలు బతుకుతున్నాయి. పన్ను భారంతో ఇప్పుడు వారి నోట్లో మట్టికొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. కొత్త ఏడాది కార్మికులకు ఏదైనా తీపి కబురు చెప్పాల్సిందిపోయి, జనవరి ఒకటి నుంచే చేనేతపై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచుతున్నది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా గత శనివారమే జారీచేసింది. ఇప్పటికే చేనేత, జౌళి రంగానికి చెందిన అనేక బోర్డులు, నియంత్రణ, అభివృద్ధి సంస్థలను రద్దుచేసి అనాథను చేసిన మోదీ సర్కారు, జీఎస్టీ పెంపుతో పరిశ్రమకు ఉరి వేసినట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న కాలంలో నిర్వహించిన 39, 40, 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లోనే టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. కరోనా వల్ల పరిశ్రమ అప్పటికే కుదేలవటంతో దీనిని అనేక రాష్ర్టాలు వ్యతిరేకించటంతో అప్పుడు వెనక్కు తగ్గింది. తాజాగా నిర్వహించిన 45వ జీఎస్టీ కౌన్సిల్లో టెక్స్టైల్పై పన్నును 5 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కిమ్మనకుండా తలూపాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. చేనేత చరిత్ర, కార్మికుల దయనీయ జీవన స్థితిగతుల దృష్ట్యా జీఎస్టీని పెంచవద్దని బలంగా వాదించింది. అయినా, కేంద్రం మొండిగా పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నది. దీంతో నేతన్నల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది.
వస్త్రపరిశ్రమ ఆధునీకరణతో చేనేత కార్మికుల బతుకులు దేశంలో దినదినగండంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు లేని రోజు ఉండలేదంటే అతిశయోక్తి కాదు. ఒక కార్మికుడు నెలంతా కాయకష్టంచేసినా ఐదారు వేల రూపాయలకంటే ఎక్కువ ఆదాయం లేకపోవటంతో కుటుంబాలను పోషించలేక వేలమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ అధికంగా విస్తరించి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలను ఆపటమే ప్రథమ లక్ష్యంగా తీసుకొని కార్యక్రమాలు చేపట్టింది. కార్మికుల ఆదాయాలు పెంచటంతోపాటు అన్నిరకాలుగా ధైర్యంచెప్తూ వస్తున్నది. గతేడాది కరోనా కాలంలో కోట్లరూపాయలు ఇచ్చి ఆదుకొన్నది. దీంతో రాష్ట్రంలో నేత పరిశ్రమ ఇప్పుడిప్పుడే మళ్లీ గత వైభవాన్ని సంతరించుకొంటున్నది. నిజానికి మనదేశంలో చేనేతపై పన్నులువేసిన చరిత్ర ఎన్నడూ లేదుకు దేశభక్తులమని చెప్పుకొంటున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 5 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై పన్నులేయమేంటని టీఆర్ఎస్, రాష్ట్రప్రభుత్వం మొదటినుంచీ కేంద్రంతో కొట్లాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న టైక్స్టైల్స్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాస్తే కనీసం స్పందించిన పాపాన పోలేదు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పన్ను విధింపు ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తే, అధిష్ఠానానికి భయపడి బీజేపీ పాలిత రాష్ర్టాలు మద్దతుగా తలాడించి ఆయా రాష్ర్టాల్లో నేతకార్మికుల మెడలకు ఉరి తగిలించాయి. కరోనాతో ఇప్పటికే కుదేలైన వస్త్రపరిశ్రమపై 12 శాతం పన్ను విధింపుతో ముడిసరుకుతోపాటు వస్త్రం ధరలు పెరుగుతాయి. దీంతో డిమాండ్ పడిపోయి పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏడేండ్లుగా ఒక్కో పోగు అల్లుతూ నేత కార్మికుల బతుకులను ఓ దారికి తెచ్చామని, ఇప్పుడు వారి బతుకులు కుప్పకూలుతుంటే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నేతన్నల బతుకుకోసం, బాగుకోసం మహోద్యమానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేస్తున్నారు.