భారతీయ స్త్రీలకు బొట్టు సంస్కృతిలో భాగం: క్రైస్తవ పరిషత్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 14: భారతీయ స్త్రీలకు బొట్టు అనేది సంస్కృతిలో భాగమని, ఆ ఉద్దేశంతోనే మంగళవారం నుంచి క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పరిషత్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మతం మారినా క్రైస్తవ స్త్రీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మతం, సంస్కృతి వేర్వేరని, ఇక్కడి మహిళలకు కట్టు, బొట్టు అనేది సంస్కృతికి చిహ్నమని వెల్లడించారు. దేశ సంస్కృతిని కాపాడేందుకు క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వివరించారు. నిజాంపేటలోని గాస్పల్ చర్చిలో సుమారు వెయ్యి మందికిపైగా మహిళలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. తెలంగాణ, ఏపీతో పాటు ఉత్తర భారతదేశంలోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.