హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాంటిబాడీ కాక్టైల్ డ్రగ్ను యశోద దవాఖాన అందుబాటులోకి తెచ్చింది. సిప్లా సహకారంతో ఈ డ్రగ్ను బుధవారం సికింద్రాబాద్ యశోద దవాఖానలో ప్రారంభించినట్టు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. తొలిరోజు ఇద్దరు రోగులకు ఈ డ్రగ్ ఇవ్వగా.. వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వివరించారు. గతేడాది ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇదే డ్రగ్ను తీసుకొని త్వరగా కోలుకున్న విషయాన్ని గుర్తుచేశారు. డీసీజీఐ ఆమోదం పొందిన ఈ డ్రగ్ మూడురోజుల క్రితమే భారత్లో ప్రారంభించినట్టు వివరించారు. ఈ డ్రగ్ సత్వరమే రోగనిరోధకశక్తిని పెంచుతుందని, వైరల్ లోడ్ తగ్గించడంతో వైరస్ తీవ్రత తగ్గిపోతుందని చెప్పారు. ఈ డ్రగ్ రోగిలో ఇమ్యునోగ్లోబ్లిన్ (IgG1)ను ఉత్పత్తి చేయడంతో రోగనిరోధకశక్తిని పెంచే తెల్లరక్తకణాలను వృద్ధి చేస్తుందన్నారు. ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ అనేవి వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను అడ్డుకోవడంతోపాటు వైరస్ శరీర కణాల్లోకి ప్రవేశించకుండా బ్లాక్ చేస్తుందని తెలిపారు. పాజిటివ్ రోగులతో కాంటాక్ట్ అయినవారికి ముందస్తుగా ఈ డ్రగ్ ఇస్తే వారికి వైరస్ సోకదన్నారు. కుటుంబంలో ఎవరికైనా వైరస్ సోకినప్పుడు మిగిలినవారంతా ఈ డ్రగ్ తీసుకొంటే ముప్పుతప్పుతుందని చెప్పారు.