న్యూఢిల్లీ, జనవరి 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 6 నెలల గరిష్ఠానికి ఎగిసింది. డిసెంబర్లో 5.59 శాతంగా నమోదైంది. ఎగిసిన ఆహారోత్పత్తుల ధరలే ఇందుకు కారణమని బుధవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాలు చెప్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో తెలియజేసింది. అంతకుముందు నెల నవంబర్లో 1.87 శాతంగానే ఉండటం గమనార్హం. ఇక ఈ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 4.91 శాతంగా ఉంటే, 2020 డిసెంబర్లో 4.59 శాతంగా ఉన్నది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా ప్రకారం ఈ జనవరి-మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చు. ఆ తర్వాత తగ్గుతుందని చెప్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలు ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగానే జరుగుతాయన్న విషయం తెలిసిందే. నిజానికి ఒమిక్రాన్తో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతోనే వడ్డీరేట్ల పెంపు జోలికి గత సమీక్షలో ఆర్బీఐ వెళ్లలేదన్న అభిప్రాయాలున్నాయి. అయితే ద్రవ్యోల్బణం విజృంభిస్తే రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డింపులు ఖాయమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 6 శాతాన్ని మించరాదని ఆర్బీఐ పరిమితి పెట్టుకున్నది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి గతేడాది నవంబర్లోనూ నిరాశాజనకంగానే ఉన్నది. వరుసగా మూడో నెలా స్తబ్ధత నెలకొన్నది. లోబేస్ నేపథ్యంలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 1.4 శాతంగా నమోదైంది. 2020 నవంబర్లో ఐఐపీ మైనస్ 1.6 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈసారి వృద్ధిరేటు ఇంతైనా సాధ్యమైంది. ఇక ఈసారి తయారీ రంగ ఉత్పాదకత వృద్ధి 0.9 శాతంగా ఉన్నట్టు బుధవారం ఎన్ఎస్వో తెలియజేసింది. గనుల రంగంలో 5 శాతం, విద్యుదుత్పత్తిలో 2.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో ఐఐపీ వృద్ధిరేటు 17.4 శాతంగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 15.3 శాతంగా ఉన్నది. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ల మధ్య 2020 మార్చి నుంచి దేశీయ పారిశ్రామికోత్పత్తి కుదేలైన విషయం తెలిసిందే. 2020 మార్చిలో మైనస్ 18.7 శాతంగా ఉన్న ఐఐపీ గణాంకాలు.. ఆ మరుసటి నెల ఏప్రిల్లో ఏకంగా మైనస్ 57.3 శాతానికి దిగజారింది. దేశవ్యాప్త లాక్డౌనే ఇందుకు కారణం.