హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందుచూపు లేమితో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉన్నది? అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయా లేదా? అనేదానిపై నరేంద్రమోదీ సర్కార్కు సరైన అంచనాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. దేశంలో వరి సాగు తగ్గించాలని కేంద్రం గత రెండేండ్ల నుంచి రాష్ర్టాలను ఒత్తిడి చేసింది. దీంతో రైతులు ఇతర పంటలను సాగు చేసేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ర్టాల్లో రైతులు మొన్నటి యాసంగిలో పొలాలను బీడుగా ఉంచారు. ఫలితంగా వరి సాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోవడంతో ప్రస్తుతం బియ్యానికి గిరాకీ భారీగా పెరిగింది.
తదనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్వింటాల్ బియ్యం ధర రూ.2,200 నుంచి రూ.3 వేలకుపైగా పెరిగి 7 నెలల గరిష్ఠ స్థాయికి చేరినట్టు ఎగుమతిదారులు చెప్తున్నారు. దీంతో కేంద్రం తన తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వరి సాగు వద్దని గతంలో చెప్పిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ఇప్పుడు అదే నోటితో వరి సాగును ప్రోత్సహించాలని రాష్ర్టాలను వేడుకొంటున్నారు. దీన్ని బట్టే కేంద్రానికి ముందుచూపు లేదని స్పష్టమవుతున్నది. గతంలో మాదిరిగా వరి సాగును ప్రోత్సహించి ఉంటే ఇప్పుడు దేశంలోని రైతులకు మంచి ధర దక్కేది. కానీ కేంద్ర ప్రభుత్వ విధానలేమితో రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం మన దేశంలో బియ్యం నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నిబంధనల ప్రకారం 13.6 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలి. కానీ, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 11.4 మిలియన్ టన్నులకు పడిపోతుందన్న అంచనాలున్నాయి. అంటే బఫర్ స్టాక్ కన్నా 2.2 మిలియన్ టన్నులు తగ్గనున్నాయి.
రాష్ట్ర నిర్ణయంతో కేంద్రంలో గుబులు
దేశంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానానికి దూసుకెళ్తున్న తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, రా రైస్ మాత్రమే కావాలని కొర్రీలు పెట్టింది. చిన్న చిన్న కారణాలతో నెలన్నరకుపైగా బియ్యం సేకరణను నిలిపేసింది. దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కేంద్రంలో గుబులు మొదలైంది. తెలంగాణలోని ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే దేశంలో ఆహార సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉన్నదని గ్రహించింది. సుమారు నెలన్నరగా తెలంగాణను సతాయించిన మోదీ సర్కారు ఇప్పుడు ఎట్టేకలకు తన తప్పును తెలుసుకొన్నది. రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణకు అంగీకరించి, ఆగమేఘాలపై గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీచేసింది.