హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
జగిత్యాల జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ భాను ప్రకాశ్ రావు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ షేక్ జాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ ఆవిష్కరించారు.
నాగర్కర్నూల్ : జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కలెక్టర్ మనూ చౌదరి పాల్గొన్నారు.