హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు సాంకేతిక విద్యామండలి ‘పాలిక్వెస్ట్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిద్వారా ఏడాది పాటు బడుల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థులను పాలిటెక్నిక్ కోర్సుల వైపు ఆకర్షింపజేయడానికి పాలిక్వెస్ట్ను తీసుకొచ్చారు. నిరుడు వరకు రాష్టంలో 118 పాలిటెక్నిక్ కాలేజీలుండగా, వచ్చే విద్యాసంవత్సరం మణుగూరు, మహేశ్వరం, షాద్నగర్లలో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలు ప్రారంభంకానున్నాయి.
గత ఏడాది వరకు మొత్తం 29 వేల పైచిలుకు సీట్లుంటే, 17,360 సీట్లే భర్తీ అయ్యాయి. మరో 12,300 సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాలిటెక్నిక్ కాలేజీలను బలోపేతం చేయాలని సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. అందులోభాగంగా ప్రత్యేక అధికారుల బృందాన్ని పలు రాష్ర్టాలకు పంపించి అధ్యయనం చేయించింది. ఆయా బృందంలోని అధికారులు ఇటీవలే ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ నివేదికలో అడ్మిషన్లు పెంచేందుకు బడుల్లో స్పెషల్ డ్రైవ్లను నిర్వహించి అవగాహన కల్పిస్తున్న విషయాన్ని పొందుపరిచారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచే పాలిక్వెస్ట్ను నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ వెల్లడించారు.