అశ్వారావుపేట, జూలై 21 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)లో ఓటు హక్కును స్థిరీకరించుకోవడం కోసం ఓటర్లు సొంతూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఒక ఓటరుకు దేశంలో ఒకే ఓటు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో ఓటర్లందరూ తమ గణన పత్రాల ద్వారా తమ వివరాలను బీఎల్వోలకు అందజేస్తున్నారు. అయితే, విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లందరూ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటు హక్కు వివరాలను నిర్ధారించుకుంటున్నారు.
ఇందులో తాము తాత్కాలికంగా నివాసం ఉంటున్న, ఓటు వేసేందుకు అందుబాటులో ఉంటున్న ప్రాంతాలను కాకుండా.. తమ స్వగ్రామాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తుండడం గమనార్హం. సొంతిల్లు, సాగు భూమి ఉన్న సొంతూళ్లనే తమ శాశ్వత చిరునామాగా ఉంచుకోవాలన్న అభిప్రాయంతోనూ; బతుకుదెరువు కోసం నగరాల బాట పట్టినా తిరిగి సొంతూరికే వస్తామన్న అభిమతంతోనూ; స్థానికతకు ప్రాముఖ్యం సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగస్వాములమయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనూ అధికమంది ఓటర్లు తమ ఓటు హక్కును పల్లెల్లోనే కొనసాగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ విషయం స్పష్టమవుతుండడం విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో నిరాశాజనకంగా కొనసాగుతోంది. డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో పూర్తి కావడం లేదు. ఒక ఓటరుకు దేశంలో ఎక్కడైనా ఒకే ఓటు ఉండాలన్న ఈసీఐ నిబంధనతో ఓటర్లు సొంతూళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం కొందరు స్వయంగా పల్లెలకు వచ్చిన తమ గణన ఫారాలను పూర్తిచేసి బీఎల్వోలకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పట్టణాల్లో కొంత వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. పల్లెల్లో మాత్రం మందకొడిగా కొనసాగుతోంది.
భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 71.68 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. మరో పది రోజుల్లో గడువు ముగియనుంది. ఈ సమయంలో మిగతా 28.32 శాతం ఎలా పూర్తి చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ కోసం ఈసీఐ తొలి షెడ్యూల్లో ప్రకటించిన గడువు ఈ నెల 24కే ముగియాల్సి ఉంది. కానీ, సమయం సరిపోదన్న ఆందోళనలు మొదలుకావడం, గణన పత్రాల పంపిణీయే పూర్తికాకపోవడం, ఇదే విషయంపై బీఆర్ఎస్ కూడా ఢిల్లీ స్థాయిలో ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసీఐ కూడా గడువును మరో పది రోజులకు పెంచుతూ.. ఆగస్టు 3లోగా పూర్తిచేసేందుకు వెసులుబాటు కల్పించింది.
జిల్లావ్యాప్తంగా మొత్తం 5 నియోజకవర్గాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఈ నెల 21 నాటికి 7,14,093 మంది గణన పత్రాలను బీఎల్వోలు డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రక్రియ శాతం 71.68 శాతం నమోదైంది. ఇంకా 28.32 శాతం పూర్తి కావాల్సి ఉంది. అయితే, మరో పది రోజులు మాత్రమే గడువు ఉండడంతో నూరు శాతం లక్ష్యాన్ని ఎలా పూర్తి చేస్తారన్న ఆందోళనలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు సమీపిస్తోంది. ఈసీఐ పెంచిన గడువు ప్రకారం ఆగస్టు 3 వరకు సమయం ఉన్నప్పటికీ ఇంకా 28.32 శాతం ఫారాలను ఆన్లైన్ చేయాల్సి ఉండడం, ఈ ఫారాలు అందించాల్సిన ఓటర్లలో కొందరు అందుబాటులో లేకపోవడం, మరికొందరు ఓటర్లు తమ గణన పత్రాలను ఇంకా బీఎల్వోలకు అందజేయకపోవడం వంటి కారణాలతో డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే.. తదుపరి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది.
కొన్ని అవసరాల కోసం మద్దికొండ గ్రామం నుంచి అశ్వారావుపేటకు వచ్చాను. ఆ తరువాత ఇక్కడే స్థిరపడ్డాను. ఎస్ఐఆర్లో మాత్రం నా ఓటును మాత్రం మా సొంతూరులోనే నమోదు చేసుకున్నాను. అక్కడ ఇల్లు, భూములు ఉన్నాయి. ఎప్పటికైనా సొంతూరుకు వెళ్లాల్సిందే కదా. అందుకే మా ఓట్లతోపాటు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న మా పిల్లల ఓట్లను కూడా మా సొంతూరిలో నమోదు చేసుకున్నాం.
-మారుతి సత్యనారాయణ, ఓటరు, మద్దికొండ
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 73.35 శాతం ప్రక్రియ పూర్తయింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఓటర్లు కూడా ఇంకా వారి వద్ద ఉన్న గణన పత్రాలను తీసుకెళ్లి బీఎల్వోలకు అందజేయాలి. అందుబాటులో లేనివారికి ఈ విషయాన్ని తెలియజేస్తే వారు కూడా వచ్చి ఫారాలు పూర్తిచేసి అందిస్తారు.
-సయ్యద్ హుస్సేన్, ఎన్నికల విభాగం డీటీ, అశ్వారావుపేట