హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. మార్చి నెల ప్రారంభం నుంచే 15,000 మెగావాట్లను దాటడం గమనార్హం. గడిచిన నాలుగు రోజుల్లో 15 వేల మెగావాట్లను దాటి గరిష్ఠ డిమాండ్ నమోదైంది. మార్చి ఒకటిన 15,110 మెగావాట్లు, మార్చి 2న 15,060 మెగావాట్లు, మార్చి 3న 14,477 మెగావాట్లు, మార్చి 4న 15,089 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా..మంగళవారం రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 15,125 మెగావాట్లుగా నమోదైంది.
నిరుడు ఇదే రోజు నమోదైన గరిష్ఠ డిమాండ్ 14,115 మెగావాట్లు. అంటే ఏడాదిలో1,010 మెగావాట్ల అదనపు డిమాండ్ ఏర్పడింది. నిరుడు మార్చిలో నమోదైన 15,497 మెగావాట్ల అత్యధిక డిమాండ్ రికార్డును ఈ నెలలోనే దాటిపోయే అవకాశముందని విద్యుత్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 4న రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 294.41 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యింది. ఈ గరిష్ఠ డిమాండ్, వినియోగం ఇలాగే పెరగడం ఏప్రిల్, మే వరకు కూడా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. వరి కోతల సమయానికల్లా విద్యుత్తు డిమాండ్, వినియోగంలో తగ్గుదల ఉంటుందని, అప్పుడు వ్యవసాయం వినియోగం తగ్గి, గృహ, వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్, పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.