వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్లలను వదిలారు.
అనంతరం లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..ప్రపంచంలోనే మంచినీటిలో చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణలో ఏటేటా చేపల ఉత్పత్తి పెరుగు తుందన్నారు. పింఛన్లు రాలేదని ఎవరు బాధపడొద్దని, అర్హులందరికీ ఆసరా ఫించన్లు అందజేస్తామన్నారు.
కరోనా వచ్చినా రైతుబీమా,రైతుబంధు ఆపలేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మరో పది లక్షల మందికి ఫించన్లు అందజేస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల ఆశీస్సులు అందించాలన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, శ్రీరంగాపూర్ ఎంపీపీ గాయత్రి, వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు జగన్నాథ నాయుడు, రైతుబంధు అధ్యక్షులు గౌడ నాయక్, తదితరులు పాల్గొన్నారు.