నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. ఉపాధి కరువైన ఊళ్లు.. వెరసి ఆకలి చావులు. పట్టణాలకు వలసలు. లేబర్ అడ్డాలపై పనికోసం వెతుకులాటలు. దినదిన గండంగా గడిచిన బతుకులు… ఇదీ ఒకనాటి తెలంగాణ పల్లెల బతుకుచిత్రం! ఇదంతా గతం.. ఇప్పుడు ఆ శిశిరం ముగిసింది. మండుటెండల్లోనూ చెరువులు తడలుగొడుతున్నాయి. ఎండిన వాగు ఎడతెగక పారుతున్నది. పట్టెడు గింజలు రాల్చని భూమి పుట్లకొద్దీ ధాన్యాన్ని ఇస్తున్నది. కైకిలి దొరకని కాలం నుంచి కైకిలోళ్లు దొరకని కాలమొచ్చింది. మూడు కాలాల్లోనూ కూలీ పని ఉంటుండడంతో ఒకనాడు వలసపోయిన తెలంగాణ పల్లెలకే ఈనాడు ఎక్కడెక్కడి నుంచో వలస వస్తున్నారు. ఇదీ స్వరాష్ట్ర ఫలం. సాకారమైన అమరుల స్వప్నం. సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం.
తెలంగాణ వ్యవసాయిక ప్రాంతం. రాష్ట్ర జనాభాలో దాదాపు 70 శాతం మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు చిత్రం ఛిన్నాభిన్నమయ్యింది.
కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సర్కారు అమలు చేసిన బహుముఖ వ్యూహాలు నేడు ఆ పరిస్థితులన్నిం టినీ తారుమారు చేసింది. మిషన్ కాకతీయ, చెక్డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా పాతాళ గంగమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఏడాది పొడవునా చెరువులు తడలుగొడుతుం డగా, ఒకనాడు ఎండిన వాగులన్నీ నేడు జీవధారలయ్యాయి. ఫలితంగా వ్యవసాయ స్థిరీకరణ పొందుతున్నది. నికరంగా రెండు పంటలకు భరోసా లభించింది.
తెలంగాణ ఎత్తయిన ప్రాంతం. నేల మీద పడిన వర్షం నీరు పడ్డది పడ్డట్టు కిందికి జారిపోతుంది. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగానే కాకతీ యులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఫలితంగా బంగారు పంటలు పండించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల కుట్రల ఫలితంగా ఆ చెరువులు పూర్తిగా మట్టి కొట్టుకుపోయాయి. ఏళ్లు గడిచినకొద్దీ భూగర్భ జలాలు అడుగంటిపో యాయి. సాగు నీటి ప్రాజెక్టులు పేరుకే తప్ప కాలువలు పార లేదు.. శెల్కల దూపతీరలేదు.. వెరసి ఎవుసానికి వర్షంపై ఆధారపడడం తప్ప మరో మార్గం లేని దుస్థితి.
నీళ్లు ఉన్నచోట బోర్లతోని సాగు చేద్దా మన్నా కరెంటు ఎప్పుడు ఉంటదో? ఎప్పుడు పోతదో తెల్వదు. కనీసం ఒక్క పంట కూడా పండని కరువులకు నిలయ మైంది. ఫలితంగా తెలంగాణలో వ్యవసాయ రంగం అస్థిరతకు గురైంది. వర్షాల ఆధారంగానే కొనసాగింది. కాలమైనప్పుడే పంటలు పండే దయనీయ స్థితికి చేరింది. తెలంగాణ ఏర్పాటు నాటికి 2015లో ఏకంగా రాష్ట్రంలో 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించా రంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
2011 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో దాదాపు 31 లక్షల మంది సాగుదారులు ఉండ గా, 30-40 లక్షల మందికిపైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసం అస్థిరతకు గురైన వేళ వ్యవసాయ సీజన్లో నికరంగా నాడు 120-180 రోజులకు మించి పనులు లభించని దైన్యం. దీంతో ఉన్న ఊరిలో చేతినిండా పని కరువైన వేళ తెలంగాణ పల్లెలన్నీ పట్టణాలకు బాటకట్టాయి. ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు, రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాలవారికి వలస కష్టాలు తెలుసు. ఇప్పుడు చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో మత్స్య పరిశ్రమతోపాటు, పాడిపరిశ్రమ సైతం వేగంగా వృద్ధిని సాధిస్తు న్నది. వ్యవసాయానుబంధ పరిశ్రమలు సైతం విస్తరిస్తున్నాయి. ఫలితంగా నేడు ఉన్న ఊరి లోనే ఉపాధికి ఢోకా లేకుండాపోయింది. ఏడాది పొడవునా కైకిలి లభిస్తున్నది. కూలీల ఆదాయా నికి భరోసా లభించింది. తక్కువలో తక్కువ అనుకున్నా నేడు రోజు కూలీ సగటున రూ.350 వరకు లభిస్తుండడం విశేషం.
వ్యవసాయ అభివృద్ధి, అనుబంధ రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. మహిళల ప్రమేయం లేకుండా వ్యవసాయం ముందుకు సాగదంటే అతిశయోక్తేమీ కాదు. విత్తడం, కలుపు తీయడం, నీటిపారుదల, ఎరువుల అప్లికేషన్, గడ్డి కోత, తీయడం, పత్తి కర్ర సేకరణ, ఫైబర్ నుంచి విత్తనాలను వేరు చేయడం, పశుపోషణ, పాలు పితకడం, పాల ప్రాసెసింగ్, నెయ్యి తయారీ వంటి ఇతర సంబంధిత కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. మేతతోపాటు పశుపోషణలో మిగతా నిర్వహణ కార్యకలాపాలన్నీ ప్రధానంగా మహిళలే చూస్తారు. మహిళలు వివిధ వ్యవసాయ కార్యకలాపాల్లోనే కాదు, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించ డానికి ఉత్పత్తి, పంటకు ముందు, పంట అనంతర ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మారెటింగ్ వంటి అన్ని స్థాయిల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటారు. నేడు రాష్ట్రంలో వ్యవసాయం స్థిరీకరణ పొందడంతో ఊరిలోనే చేతినిండా, పనికి తగిన కూలీ లభిస్తుండడంతో ప్రధానంగా ఆడబిడ్డల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ఉపాధి అవకాశాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. వ్యవసాయ స్థిరీకరణతో ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రికత దాదాపు 50 శాతానికి చేరుకున్నది. ప్రత్యక్షంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. నిర్మాణ రంగం విస్తరిస్తున్నది. అందుకు అనుబంధంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇటుకల తయారీ, పేపర్ ప్లేట్స్ మాన్యుఫాక్చరింగ్, క్యాటరింగ్, ఇంజినీరింగ్ వర్క్స్, ఫర్నిచర్ తయారీ తదితర సూక్ష్మస్థాయి పరిశ్రమలు సైతం విస్తృతంగా గ్రామాల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణతో వలసలన్నీ ఆగిపోయాయి. పల్లెను, ఎవుసాన్ని విడిచిన వెళ్లిన చిన్న, సన్నకారు రైతులు తిరిగి పల్లెకు చేరుకొని ఎవుసాన్ని సాగిస్తున్నారు. ఒకనాడు వలసపోయిన తెలంగాణ పల్లెలకే నేడు ఇతర రాష్ర్టాల నుంచే కూలీలు వలసబాట పడుతుండడం గర్వకారణం. నికరమైన పనులు, పనికి తగిన కూలీ రేట్లు లభిస్తుండడంతో పొరుగున ఉన్న ఏపీతోపాటు ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, బెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి వేలాది మంది వలసవస్తూ తెలంగాణలో పొట్ట పోసుకుం టున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఇతర రాష్ర్టాల కూలీలు బృందాలు బృందాలుగా తరలివచ్చి సీజన్లో వ్యవసాయ పనులు చేస్తుండడం విశేషం. రోజువారీ కూలీకి కాకుండా నాట్లు వేయడం తదితర పనులను ఎకరాకు రూ.4500-6000 చొప్పున గంపగుత్తగా మాట్లాడుకొని పనులు సాగిస్తున్నారు. నాటు పనులకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇతర పనులకు కూడా ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వరుస కడుతున్నారు.