హైదరాబాద్, మే 25, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్తో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయి. ఉదయం 10 దాటాక అనుమతి ఉంటే, అదీ సరైన కారణం ఉంటే తప్ప బయటికి వచ్చే ఎవరికీ అవకాశంలేదు. అంతా ఇండ్లలోనే ఉండటంతో మహిళలకు పనిభారం పెరగడంతోపాటు భర్త, ఇతర కుటుంబసభ్యుల నుంచి వేధింపులు పెరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం లాక్డౌన్ అమల్లోకి వచ్చిన ఈ నెల 12 నుంచి 24 వరకు డయల్ 100కు మొత్తం 47,692 ఫిర్యాదులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 7,679 ఉన్నాయి. మహిళలపై వేధింపులపై 2,752, గృహహింసపై 4,395 ఫిర్యాదులు అందాయి. లైంగికదాడి చేయబోయారని 44 మంది, చేశారని ఇద్దరు బాధితులు, కట్నం కోసం వేధిస్తున్నారని 37మంది గృహిణులు, బాల్య వివాహాలకు సంబంధించి 75, సైబర్క్రైం, బ్లాక్మెయిలింగ్పై 98 మంది, ఇతర కారణాలతో 222 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని మహిళా భద్రత విభాగానికి, సంబంధిత పోలీస్స్టేషన్లకు డయల్ 100 సిబ్బంది కనెక్ట్చేశారు. చోరీలకుసంబంధించి 1,928, ఆత్మహత్యలపై 593, రోడ్డు ప్రమాదాలపై 1,316 ఫిర్యాదులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
లాక్డౌన్కు సంబంధించి 6,431 ఫిర్యాదులు అందాయి. వీటిలో గుంపులు ఉంటున్నారని 3,121, దుకాణాలు తెరిచే ఉంటున్నాయని 1,947, కొవిడ్ అనుమానితులపై 633, మాస్క్ పెట్టుకోవడం లేదని 308, కొవిడ్ అనుమానిత మృతుల గురించి 144, అంబులెన్స్ల కోసం 66, ఆక్సిజన్, వెంటిలేటర్లకు 45, దవాఖానల్లో బెడ్ల కోసం 23, దవాఖానల్లో అధిక బిల్లులు తదితర సమస్యలపై 30 ఫిర్యాదులు వచ్చాయి.