హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చేప్రాల 43.3, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి 43.1, జగిత్యాల జిల్లా మద్దుట్ల 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు శనివారం వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించింది.