సిద్దిపేట : సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు బంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బోర్లా నుంచి నీరు ఉబికి వస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 6 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాంలు ఉండగా..రాష్ట్రం ఏర్పడ్డాక 35లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం లను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు.
ఎంత పంట వచ్చిన కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు.
యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనమని చెప్పడం సరికాదు. ఈ విషయాన్ని కేంద్రం పున: సమీక్షించాలి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు పారేసుకోవడం కాదు. కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ సూచించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్ రెడ్డి, సీపీ జోయల్ డెవిస్ తదితరులు ఉన్నారు.