హైదరాబాద్ : ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి రాష్ట్రంలోకి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రోజురోజుకు చలితీవ్రత పెరుగడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలో తక్కువగా నమోదవుతాయని, దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం చలికి తోడు దట్టంగా పొగమంచు కురుస్తున్నది. దీంతో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తీర్మాణి మండలం గిన్నెదరిలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
వికారాబాద్ జిల్లా మర్పల్లిలో11.1, సంగారెడ్డి జిల్లా కోహిర్, కుమ్రంభీం జిల్లా సిర్పూర్(యు) 11.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లె 11.4, జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల 11.9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా ఖమ్మం పట్టణంలో 33.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వివరించింది.