గోదావరిఖని, జనవరి 3: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19 శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కోల్కతాలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగొవచ్చి 19 శాతం వేతనాల పెరుగుదలకు అంగీకరించాయి. ఇందులో పాల్గొన్న హెచ్ఎంఎస్ మాత్రం 20 శాతం ఇవ్వాలని పట్టుబట్టింది. చివరకు ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ యూనియన్లు సంతకాలు చేయడంతో ఒప్పందం కుదిరింది. మొదటి క్యాటగిరీ కార్మికుడికి రూ.6,973.73 పెరుగుదల ఉంటుందని నాయకులు తెలిపారు. పదో వేతన ఒప్పందంలో మొద టి క్యాటగిరీ కార్మికుడికి రూ.4,800 లబ్ధ్ది కలిగితే ఈసారి రూ.7 వేల వరకు ఉంటుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మొదట 4 కార్మిక సంఘాలు 28 శాతం ఎంజీబీ చెల్లించాలని డిమాండ్ చేయగా కోలిండియా యాజమాన్యం 12 శాతం నుంచి పెంచుతూ వచ్చి చివరకు 19 శాతానికి అంగీకరించింది.