హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. గెస్ట్ టీచర్కు గతంలో గంటకు రూ.140 చెల్లించగా.. పెరిగిన వేతనం ప్రకారం గంటకు రూ.240 చెల్లించనున్నారు.
అదే విధంగా గెస్ట్ లెక్చరర్కు గతంలో గంటకు రూ.180 ఉండగా.. రూ.270కు పెంచారు. బోధనా సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా పెంచామని బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 2022- 23 విద్యాసంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామని, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పరీక్ష రాస్తున్న వారు ఇంటర్ కోర్సుల కోసం, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాస్తున్న బాలికలు మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జూన్6న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 119 గురుకుల విద్యాసంస్థలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన తెలిపారు. బీసీ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించి వారికి విద్యను అందించాలని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి కోరారు.