హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : గ్రూప్2, గ్రూప్3 పోస్టులను పెంచకుండా పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొన్నారు. పోస్టుల పెంపు కోసం లక్షలాది మంది నిరుద్యోగుల ఎదురుచూస్తున్నారని తెలిపారు. రెండేండ్లుగా నోటిఫికేషన్లు లేవని, కొత్త ప్రభుత్వంలో కూడా గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్2022లో ప్రకటించిన పోస్టులను వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని సీఎం రేవంత్ గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో లక్షలాది మంది నిరుద్యోగులు లైబ్రరీలకు, స్టడీ రూమ్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. తీరా పాత నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల తేదీలను ప్రకటించడం విచారకరమని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి.. గ్రూప్ 2 పోస్టులను 2వేలు, గ్రూప్ 3 పోస్టులను 3వేలకు పెంచాలని నిరుద్యోగులు కోరారు.