హైదరాబాద్, జనవరి 19 (నమస్తేతెలంగాణ): హరితనిధికి 20 టన్నుల ఎర్రచందనం చెట్లు అందిస్తానని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రకటించారు. రామయ్య బుధవారం ప్రగతిభవన్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితనిధి కార్యక్రమాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో పర్యావరణ రక్షణ దిశగా ప్రభు త్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని రామయ్య అభినందించారు. దేశమంతా పచ్చగా మారాలని, హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా చాలెం జ్ విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉం డాలని రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వాతావరణ మార్పులను ఎదుక్కోవటానికి ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. ఎర్రచందనం మొక్కలు తానే స్వయంగా నాటి పెద్ద చేశానని రామయ్య తెలిపారు. అనంతరం రామయ్య దంపతులకు పాదాభివందనం చేసిన సంతోష్కుమార్.. వారి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఏడు పదుల వయసులోనూ నిత్యం ఉత్సాహంతో పర్యవరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు వారిని అభినందించారు. రామయ్య దంపతులను కలవడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సంతోష్కుమార్.. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు.