భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లాను కోరిన సీఎస్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కొవాగ్జిన్ టీకా సరఫరా పెంచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లాను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు సీఎస్ మంగళవారం బీఆర్కే భవన్లో కృష్ణ ఎల్లాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొవాగ్జిన్ ఉత్పత్తి, సరఫరా, ముడి సరుకుల లభ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. కరోనా బారి నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంతా వ్యాక్సినేషన్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వేగంగా టీకాల పంపిణీ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ మేరకు కొవాగ్జిన్ డోసుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీకాలను అత్యధికంగా సరఫరా చేయాలని సీఎస్ కోరారు. దీనికి కృష్ణ ఎల్లా సానుకూలంగా స్పందించారని అధికారులు తెలిపారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.