హైదరాబాద్ : రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త వినిపించింది. ప్రస్తుతం పరీక్షా సమయం 2 గంటల 45 నిమిషాలు కాగా.. దీన్ని 3 గంటల 15 నిమిషాలకు పెంచింది. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్ఏ పరీక్షలకు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పరీక్షలు భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఇవ్వనున్నారు.
2021-22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్ను పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.