నర్సింహులపేట, జూన్ 12: లంచం తీసుకుంటూ ఎంపీడీవో, ఆమె కుమారుడితోపాటు ఎంపీవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఏసీబీకి పట్టుబడిన ఎంపీవో యాకయ్యకు ఎంపీడీవో గా ఇదే రోజు సాయంత్రం ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండగా, ఎంపీడీవో రాధిక సైతం ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారులో ఇటీవల హరిగిరి టౌన్షిప్ పేరుతో పుష్పాల సురేశ్ నాలుగు ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. అధికారుల అనుమతి కోసం వరంగల్లోని డీడీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలో వెంచర్ పక్కన ఉన్న ఓ రైతు ఎంపీడీవో, ఎంపీవోకు ఇటీవల ఫిర్యా దు చేశాడు.
వెంచర్ యజమాని కోర్టును ఆశ్రయించగా, వెంచర్ను అడ్డుకోవద్దని కోర్టు అధికారులకు సూచించింది. గ్రామ పంచాయతీ నుంచి అనుమతుల కోసం వెంచర్ యజమా ని సురేశ్ను డబ్బులు డిమాండ్ చేయగా, ఎంపీడీవోకు రూ.30వేలు, ఎంపీవోకు రూ. 25 వేలు ఇచ్చాడు. మళ్లీ రూ.45వేలు డిమాండ్ చేయడంతో ఇసుగు చెందిన సురేశ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచన మేరకు రూ.45వేలను ఎంపీడీవో, ఎంపీవో, ఎంపీడీవో కుమారుడికి ఇస్తుండగా రెడ్హ్యాడెండ్గా పట్టుకున్నారు. ఎంపీడీవో కుమారుడు నాగార్జున ఇటీవల ఓ పత్రికలో జరల్నిస్టుగా వ్యవహరిస్తూ, తల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి అయ్యాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి ఎంపీడీవో రాధిక పట్టుబడటంతో కార్యాలయం ఎదుట స్థానికులు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు.