బన్సీలాల్పేట్, మే 5: డెలివరీ కోసం దవాఖానకు తీసుకువచ్చిన భార్యను, ఆరేండ్ల కుమారుడిని వదిలి వెళ్లిపోయిని సంఘటన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా సలురా క్యాంప్ ప్రాంతానికి చెందిన యు.గంగాధర్ ఈ నెల 1వ తేదీన తన భార్య మాధవి(30)ని డెలివరీ నిమిత్తం అడ్మిట్ చేశాడు. పరీక్షించిన వైద్యులు మాధవి గుండెలో సమస్య ఉన్నదని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి గంగాధర్ కనిపించకుండా పోయాడు.
మాధవికి డెలివరీ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ వెంటనే మృతి చెందింది. అయితే ప్రసవం అనంతరం మాధవి అపస్మారక స్థితిలోకి చేరుకోగా.. వైద్యులు ఆక్సిజన్ అమర్చి, చికిత్స అందించారు. మరుసటి రోజు ఆమెను గైనకాలజీ విభాగంలోని ఎంఐసీయూ వార్డులోకి మార్చారు. కేస్ షీట్లో పేర్కొన్న సెల్ నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో రోగి వెంట ఎవరూ లేకపోయినా దవాఖాన సిబ్బంది ఆమెకు సపర్యాలు చేశారు. మాధవి బెడ్డు పక్కనే ఆమె కుమారుడు ఏడుస్తూ ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది చేరదీశారు. శుక్రవారం మధ్యాహ్నం మాధవికి ఆక్సిజన్ తొలగించారు. అయినా అనారోగ్యం కారణంగా ఆమె మాట్లాడలేకపోయింది. తన గురించి, భర్త గురించి చెప్పలేకపోతున్నది. దవాఖాన సిబ్బంది అందిస్తున్న సేవలను, బాలుడిని సెక్యూరిటీ సిబ్బంది ఆదరించడాన్ని చూసిన అక్కడున్న వారు ప్రశంసించారు. మాధవి కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు వచ్చి వారికి అండగా నిలువాలని దవాఖాన సిబ్బంది కోరారు.